Tuesday 16 February 2016

ఔటర్ రింగు రోడ్డులో మరో ప్రమాదం


ఔటర్ రింగు రోడ్డులో మరో ప్రమాదం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ మృతి

కారులోనుంచి ఎగిరి పడి మరి ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్, డిసెంబర్ 20 : ఔటర్ రింగు రోడ్డుపై మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్‌తో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న మరి ఇద్దరు సి.బి.ఐ.టి. విద్యార్థులు కూడా మరణించారు. వీరంతా 19 ఏళ్ల యువకులు.
మరణించిన ఆ ఇద్దరి పేర్లు చంద్రారెడ్డి, సుజిత్ రెడ్డి అని తెలుస్తున్నది. ఈ సంఘటనలో అవరోహన్ రెడ్డి అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలు తగులగా అతడిని ఆస్పత్రిలో చికిత్సకోసం చేర్పించారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎం.పి. రాజగోపాల్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల తెలంగాణాకోసం దీక్ష చేసినప్పుడు కూడా ప్రతీక్ ఆ ప్రక్కనే కూర్చుని కనిపించాడు. ప్రతీక్ మృతితో నల్గొండలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రతీక్ మృతికి ముఖ్యమంత్రి కిరణ్, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కె.సి.ఆర్, స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ఇంకా కె.పి.పి, బాలూ నాయక్, వి.హనుమంతరావు, ఆనం సోదరులు, శత్రుచర్ల, బాలరాజు, చిరుమర్తి లింగయ్య, డి.ఎల్. బాలరాజు ప్రభృతులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గురైన స్కోడా కారు వెంకటరెడ్డి బంధువు పోరెడ్డి నరసింహారెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఈ కారులో వారు సి.బి.ఐ.టి.నుంచి పటాన్‌చెరువైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. మెదక్ జిల్లా రామచంద్రాపురం మండ లం కొల్లూరు వద్ద ఒక డివైడర్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న గొర్రెలమందను తప్పించడానికి ఆకస్మికంగా బ్రేకులు వేయడంతో కారు డివైడర్‌ను కొట్టినట్టు తెలుస్తున్నది. వీరు ఎ.పి. 24 ఎ.హెచ్. 9999 నంబరు గల స్కోడా కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. సంఘటన జరిగినప్పుడు కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కారు నాలుగు పల్టీలు కొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రతీక్ రెడ్డి కారు నడుపుతున్నట్టు తెలుస్తున్నది. బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతీక్ రెడ్డికి వారం రోజుల క్రితమే ఒక ప్రమాదం తప్పినట్టు తెలుస్తున్నది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఉదయం కుమారుని కాలేజి వద్ద విడిచిపెట్టి తాను ఢిల్లీ వెళ్లారు. ప్రమాదం సంభవించిన వెంటనే కారులోపలనుంచి ఏర్ బ్యాగ్స్ ముందుకు వచ్చాయి. అయితే కారు నాలుగు పల్టీలు కొట్టడంతో కారు చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తున్నది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రతకు కారు లోపల ప్రయాణిస్తున్న యువకులు రోడ్డు మీదికి ఎగిరిపడ్డారు. దాన్ని బట్టి వీరు సీటు బెల్టులు పెట్టుకోనట్టు తెలుస్తున్నది. ఆ ప్రాంతంలో వేగ నియంత్రణ యంత్రాంగం ఏమీ లేకపోవడంవల్ల ఔటర్ రింగు రోడ్డు మృత్యు రహదారిగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందవలసి ఉంది. ఈ రోడ్డుపై ట్రాఫిక్ తక్కువ ఉండడంవల్ల వాహనాలు వేగంగా వెళ్లడంగాని, బ్రేకు సకాలంలో పడకపోవడం గాని ఇటువంటి ప్రమాదాలకు కారణంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కూడా బైక్‌పై వెళ్తూ ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అలాగే సినీ నటులు కోట శ్రీనివాస రావు కుమారుడు, బాబూ మోహన్ కుమారుడు కూడా ఇటువంటి దుర్ఘటనలలోనే మరణించారు.

లోక్ పాల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం


లోక్ పాల్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
గురువారమే లోక్ సభ ముందుకు లోక్ పాల్ బిల్లు,
ఇదేం లోక్‌పాల్, ఇక ఆందోళనే : అన్నా హజారే
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20 : లోక్ పాల్ బిల్లుకు మంగళవారం సాయంత్రం కేబినెట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును ప్రభుత్వం గురువారంనాడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన మంత్రిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకువచ్చారు. సి.బి.ఐ.ని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువచ్చినా ఇంకా ఆ సంస్థ నియంత్రణ మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంటుందని తెలుస్తున్నది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సి.బి.ఐ. డైరెక్టర్‌ను ఎంపిక చేస్తారు. ప్రత్యేకమైన ఫిర్యాదులు ఏమీ అందకపోతే లోక్ పాల్ ఏ రకమైన విచారణనూ చేపట్టడానికి అవకాశం ఉండదు. ఈ ముసాయిదా ప్రకారం లోక్ పాల్‌కు రాజ్యాంగ హోదా లభిస్తుంది. లోక్ పాల్‌ను తొలగించాలంటే పార్లమెంటులో అభిశంసన వల్ల మాత్రమే సాధ్యం.
అయితే ప్రభుత్వం రూపొందించిన బిల్లు ముసాయిదా గురించి వింటున్న సమాచారం నిజమే అయితే ఈ ముసాయిదా పౌర సమాజం కోరుకున్నట్టు లేదని అన్నా హజారే ఆక్షేపించారు. ముందుగా ప్రకటించినట్టు 27న ఆందోళనకు సన్నధ్ధమవుతున్నట్టు కూడా అన్నా ప్రకటించారు. ముందుగా అనుకున్నట్టే 27నుంచి మూడు రోజులపాటు దీక్ష, 30 వ తేదీన జైల్ భరో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. లోక్ పాల్‌ను మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. సి.బి.ఐ. ని గనక లోక్ పాల్ క్రిందికి తీసుకురాకపోతే అసలు ప్రజలు ఎందుకు ఆందోళన చేసినట్టు అని పౌర సమాజ ప్రతినిధి కిరణ్ బేది ప్రశ్నించారు.
అన్నా కోరినట్టే పార్లమెంటు సమావేశాలను మరి మూడు రోజుల పాటు పొడిగించడానికి వీలుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకోనున్నది. అయితే ఇప్పటికిప్పుడు శీతాకాల సమావేశాలను పొడిగిస్తూ నిర్ణయించడం మంచిది కాదని బి.ఎస్.పి, శివసేనలతో పాటు ఈశాన్య రాష్ట్రాల ఎం.పి.లు కూడా గట్టిగా భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
అవసరమైతే పార్లమెంటు సమావేశాలను పొడిగించి అయినా సరే, ఈ సారి సమావేశాలలోనే లోక్ పాల్ బిల్లుకు మోక్షం కలిగించాలని అన్నా హజారే ప్రభుత్వాన్ని డిమాండు చేసిన విషయం తెలిసిందే. లోక్ పాల్ పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకువచ్చే విషయమై తలెత్తిన ప్రతిష్టంభన కొంత మేరకు సడలినట్టు తెలుస్తున్నది. లోక్ పాల్ బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం నాడు సమావేశం కానున్నది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను ముందు చూశాక గాని ఆందోళన గురించి ఏమీ నిర్ణయించలేమని పౌర సమాజం ప్రతినిధులలో ఒకరైన కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం సోమవార ంనాడే జరుగుతుందని తొలుత భావించారు. అయితే అన్నా హజారే కోరుతున్నట్టుగా సి.బి.ఐ.ని కూడా లోక్ పాల్‌లో చేర్చాలన్న అంశంపై ప్రభుత్వంలోని పెద్దలు సోమవారం సాయంత్రానికి కూడా ఇంకా మల్లగుల్లాలు పడుతుండడంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. పౌర సమాజం కోరుతున్నట్టు ప్రభుత్వం గనక గట్టి లోక్‌పాల్ బిల్లుకు రూపకల్పన చేసినట్టయితే తాము ఆందోళనలు చేపట్టనక్కరలేదని అన్నా హజారే ముందే వ్యాఖ్యానించారు. లోక్ పాల్‌తో పాటే మరి రెండు బిల్లులు కూడా ఈ సారి సమావేశాలలో లోక్ సభ ముందుకు రానున్నట్లు తెలుస్తున్నది.
లోక్ పాల్ విషయంలో పార్లమెంటు సమావేశాలను మరి మూడు రోజులపాటు పొడిగించడాన్ని బి.ఎస్.పి, శివసేనలు అంగీకరించడంలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎం.పి.లు కూడా పార్లమెంటు సమావేశాల పొడిగింపు పట్ల సానుకూలంగా లేరని తెలుస్తున్నది. ఇప్పుడు వారందరినీ ఒప్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.

విశేషంగా ఆకట్టుకుంటున్న ‘రతినిర్వేదం’


విశేషంగా ఆకట్టుకుంటున్న ‘రతినిర్వేదం’
rati
rati


“ఇటీవల విడుదలైన ‘రతినిర్వేదం’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టైటిల్ విని ఇందులో అశ్లీలత పాళ్ళు ఎక్కువగా ఉంటుందనుకున్న వారికి నిజం తెలుస్తోంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అందరూ మెచ్చుకుంటున్నారు” అని చిత్ర నిర్మాత శోభ తెలిపారు. ఎస్వీఆర్ మీడియా పతాకంపై ఆమె అనువదించిన మలయాళ చిత్రమిది. శ్వేతమీనన్ నాయిక. శోభ మాట్లాడుతూ “సోమవారం కూడా థియేటర్లు జనాలతో కళకళలాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే పాటలను కళ్ళప్పగించి చూస్తున్నారు. పంచ్ డైలాగులకు క్లాప్స్ వినిపిస్తున్నాయి. రెండు ఇళ్ళ మధ్య జరిగే ఆహ్లాదకరమైన కథ ఇది. తన కన్నా వయసులో ఐదేళ్ళు చిన్నవాడైన యువకుడి మోజును గ్రహించిన ఓ యువతి మానసిక సంఘర్షణకు తెరరూపం. శ్వేతమీనన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. పెద్ద హిట్టవుతుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది” అని చెప్పారు.
Related Posts Plugin for WordPress, Blogger...